పోతన భాగవతము - శబ్దాలంకార వైచిత్రి
శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారి వ్యాసం నుంచి కొన్ని అంశాలు
- శయ్య శబ్దాలంకారములలో చేర్చబడని శబ్దాలంకారము. పతి యగు రస పరబ్రహ్మమునకై పత్ని యగు వాగ్దేవి కూర్చినదే ఈ శయ్య.
- వృత్తులు గుణములు శబ్దార్థగతములుగా రీతులు తత్తద్దేశీయ జన సమష్ట్యభిరుచుల ననుసరించి (వైదర్భీ గౌడీ పాంచాలీ) విభజించబడియున్నను వాని నిర్వచనములు చాలవఱకు శబ్ద సౌందర్య సంబంధులుగానే ఉన్నవి.
- పాకములు శబ్ద సౌందర్య సంబంధులే.
- ఈ విధముగా నాలంకారికులచే శబ్ద సౌందర్యము బహుముఖములుగా నివేదింప బడి యుండుట శబ్ద సౌందర్య ప్రాధాన్యమును స్పష్టమొనర్చుచున్నది.
- పోతన రచన వైదర్భీ రీతికి, ప్రసాద గుణమునకు, ద్రాక్షాపాకమునకును ప్రధానముగా నాశ్రయమై యున్నది.
- సర్వాలంకార శాస్త్రజ్ఞ సమ్మతములైన శబ్దాలంకారములు అనుప్రాసము, యమకము.
- అనుప్రాసము చేక లాట వృత్త్యనుప్రాస భేదమున త్రివిధములుగా విభజించబడియున్నది.
- అందు వృత్త్యనుప్రాసము సర్వ కవిజనము చేతను ప్రయోగింపబడి యున్నది.
- మహాభక్తుడు రసావేశ వివశుడు నయిన పోతన ప్రయోగించిన శబ్దాలంకారములు వానినంతగా ప్రయోగింపని తిక్కనాదులతో పోల్చి ఈ కారణముననే పోతన స్థానమును తగ్గించు విఫల యత్నమును కొందరు పండితులు యొనరించిరి.
- జపహోమతత్పరుడైన నన్నయ యందీ శబ్దాలంకార వైచిత్రి తిక్కన యందుకంటె నధికము. అంతకంటెను పోతన యందధికము.
- పోతన దృష్టిలో ఆవృత్తి లక్షణమైన ఈ శబ్దాలంకార ప్రయోగము జపము కాని జపము.
- వర్ణములు మాతృక లనబడును. అనగా జగన్మాతృ రూపములు. వాగ్దేవీ రూపములు. వాని యావృత్తి జపము. పదములు, నామములు, వాని యావృత్తియు జపమే. నామ సంకీర్తనమే. పరమార్థమైన అక్షర పరబ్రహ్మోపాసనా యోగము నాదబ్రహ్మోపాసనా యోగము రసోచిత శబ్దాలంకారములఁ గూర్చుటలో పోతనకు సిద్ధించినది. కావుననే యా పద్యములు సహృదయ హృదయ సమ్మోహన మంత్రములుగానున్నవి.
- (కనుక చిత్రకవులతో పోతనను పోల్చుట యపరాధము)
కామెంట్లు